
హైదరాబాద్: ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ సవాల్ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ కరీంనగర్, చొప్పదండిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటూ రాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్ అని, అది మోడీ సృష్టించిన కేసని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. దోషులు ఎవరో, నిర్దోషులు ఎవరో కోర్టు తేలుస్తుంద న్నారు. లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ చెబుతోంటే నవ్వొస్తోందన్నారు. కేసీఆర్ అంటున్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసుకు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు అసలు సంబంధమే లేదని కొట్టి పారేశారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపైన ఆయన స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నాడో తనకు తెలియదని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో దేవుడిపై ఒట్టేసి రాజకీయాలు చేసే వారా బీజేపీని విమర్శించేది అని ఫైర్ అయ్యారు. అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా తనను ఓడించేది అంటూ ఎద్దేవా చేశారు. మోదీ చేసిందే చెబుతారు.. చెప్పిందే చేస్తారన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.