765 జాతీయ రహదారి కోసం రూ. 578 కోట్లు...రూ. 7 వేల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి

 765 జాతీయ రహదారి కోసం రూ. 578 కోట్లు...రూ.  7 వేల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి

సిద్దిపేట-ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 578 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 9 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులకు కేంద్రం రూ. లక్ష కోట్లు కేటాయించిందని తెలిపారు. తాను ఎంపీ అయినప్పటి నుండి  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. 

రానున్న రోజుల్లో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. బండి సంజయ్ అడగ్గానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు.  సీఎం కేసీఆర్ గత యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంలో అవినీతి ఎక్కువ జరిగిందన్నారు. తెలంగాణలో 1948 నుండి 2014 వరకు జాతీయ రహదారుల నిర్మాణానికి కేవలం రూ. 2,500 కోట్లు కేటాయిస్తే.. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ 9 ఏళ్లలో రూ. 2,500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.  

బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏండ్లు అవుతున్నా.. ఒక్క మంత్రి, ఎంపీపై అవినీతి ఆరోపణలు రాలేదని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే రెండింతలు బీజేపీ ప్రభుత్వంలోనే దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడారని.. వారిలో తాను కూడా ఉన్నానన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో కుటుంబం పాలన,  అవినీతి పాలన కొనసాగుతోందని తెలిపారు.