
- కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్,రాజ్ నాథ్ కు బండి సంజయ్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తన ఎంపీ స్థానం పరిధిలోని వేములవాడ, కొండగట్టు-, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక విశ్రాంతి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక సాయం అందించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. అలాగే సిరిసిల్ల లేదా సిద్దిపేట జిల్లాలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో సహచర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, గజేంద్రసింగ్ షకావత్ ను వేర్వేరుగా కలిసి కోరారు.
తెలంగాణలో పర్యాటకాన్ని అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గజేంద్ర సింగ్ షెకావత్ అధికారులను ఆదేశించారు. అలాగే రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సందర్భంగా సైనిక్ స్కూల్ ఏర్పాటు-పై వినతి పత్రం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల లేదా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో సైనిక్ స్కూల్ పెట్టాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భూమి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సానుకూలంగా స్పందించిన రాజ్ నాథ్ సింగ్ సైనిక్ స్కూల్ ఏర్పాటు అవకాశాలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా ప్రకటనలో వెల్లడించారు.