కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్: బండి సంజయ్

కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్: బండి సంజయ్

కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని విమర్శించారు కేంద్రమంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో  నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో  మాట్లాడిన ఆయన..ఒక్కో నిరుద్యోగికి 56 వేల నిరుద్యోగ భృతి బాకీ పడిందన్నారు. యువతకు  2 లక్షల ఉద్యోగాల బాకీ,  ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు బాకీ, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ,  టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 4 డీఏలు బాకీ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో పీఆర్సీ బాకీ,  ప్రతి విద్యార్థికి కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయంబర్స్ మెంట్ బాకీ.  ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ, జీపీఎఫ్ లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ.. మేధావులారా ఈ బాకీల సర్కార్ ను బండకేసి బాదాలి అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్   తీరు  చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. .కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారు.  రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది.  కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుంటుంది. 

ALSO READ | ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు.. తెలంగాణ సర్కార్ది రికార్డ్: ఆర్ కృష్ణయ్య

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా?. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు.  ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించి జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తమదే అని బండి సంజయ్ అన్నారు.
  
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీనే. బీఆర్ఎస్ పనైపోయింది.... అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది.. క్రైస్తవుల్లో చాలా మంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు.  ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా? ఇప్పటికైనా స్పందించండి అని అన్నారు బండి సంజయ్.