
- 2019లో ఓల్డ్ సిటీలో పట్టుబడిన రెండు గ్యాంగులు
- మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
హైదరాబాద్,వెలుగు: బంగ్లాదేశ్కు చెందిన యువతుల అక్రమ రవాణా, వ్యభిచార రాకెట్కు సంబంధించి ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. 2019లో ఛత్రినాక, పహాడీ షరీఫ్ లో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన ఏజెంట్ కు చెందిన రూ.1.90 లక్షల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.
ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా దేశంలోకి తీసుకురావడంతో పాటు హైదరాబాద్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించి గతంలో ఛత్రినాక , పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల ఆధారంగా ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో విచారణ జరిపింది. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్కు తరలిస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని ట్రాప్ చేసి
ఉద్యోగాలు కల్పిస్తామని ఆశచూపి బంగ్లాదేశ్ యువతులను భారత్లోకి ఏజెంట్లు అక్రమంగా రవాణా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఫేక్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఆన్లైన్ పేమెంట్లతో డబ్బులు వసూలు చేశారు.
ఇలా సంపాదించిన డబ్బును బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే హవాలా ఏజెంట్లకు చేరవేశారు. ఈ డబ్బును బంగ్లాదేశ్లోని నిందితులు, బాధితులైన బాలికల కుటుంబాలకు బికాష్ (బంగ్లాదేశ్ బ్యాంక్ మొబైల్ ఆర్థిక సేవ) అనే యాప్ ద్వారా చెల్లించారు.
ఈ రెండు కేసుల్లో లభించిన పేటీఎం, ఇతర అకౌంట్ల ఆధారంగా ఏజెంట్లలో ఒకడైన రుహుల్ అమీన్ ధాలి అనే నిందితుడికి సంబంధించిన రూ.1.90 లక్షలు విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేయగా.. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఆరుగురు నిందితులకు గతంలోనే జీవితఖైదు విధించింది.