
బ్యాంకింగ్ రంగంలో అత్యంత క్రేజీ జాబ్ పీవో. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)లో పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 500 పీవో(ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఎంపికైన క్యాండిడేట్స్ ఏడాది పీజీడీబీఎఫ్ కోర్సు పూర్తి చేయాలి. అనంతరం అసిస్టెంట్ మేనేజర్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేసే పీవో పోస్టులు, సెలెక్షన్, పీజీడీబీఎఫ్ కోర్సు వివరాలు తెలుసుకుందాం.
వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలనేది నిరుద్యోగుల కల. మంచి జీతం, తక్కువ సమయంలోనే ప్రమోషన్స్, ఆకర్షణీయమైన అలవెన్స్లు బ్యాంక్ ఎంప్లాయిస్కు ఉంటాయి. ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మెరిట్, గ్రూప్ డిస్కషన్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్లను అనుసరించి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఖాళీలు: జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు–350, స్పెషల్ స్ట్రీమ్లో ఐటీ ఆఫీసర్ పోస్టులు–150 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో 200 మార్కులకు–155 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. దీంతో పాటు డిస్క్రిప్టివ్ విధానంలో 2 ప్రశ్నలను అడుగుతారు. వీటికి 25 మార్కులుంటాయి. దీనికి అరగంట సమయం కేటాయిస్తారు.
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలో నాలు గు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు–40 మార్కులు, రీజినింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్/ఎకనామీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ విభాగం నుంచి 35 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో నుంచి పావు వంతు తగ్గిస్తారు. ఆబ్జెక్టివ్ విభాగంలోని ఇంగ్లీష్ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ పేపర్లలో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీటిలో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఆబ్జెక్టివ్ పరీక్షలో 40శాతం అర్హత మార్కులు సాధించాలి.
గ్రూప్ డిస్కషన్: రాత పరీక్షలో మెరిట్తోపాటు, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేసిన కొంత మందిని గ్రూప్ డిస్కషన్కు పిలుస్తారు. దీనికి 40 మార్కులుంటాయి. ఇందులో జనరల్, ఈడబ్ల్యూఎస్లు కనీసం 40శాతం మార్కులు రావాలి.
ఇంటర్వ్యూ: గ్రూప్ డిస్కషన్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. మొత్తం 60 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్లు 40 శాతం, ఇతరులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.
వేతనాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,000 వరకు బేసిక్ జీతం అందుతుంది. ఈ మూలవేతనంతోపాటు ఇతర అలవెన్సులు అదనంగా లభిస్తాయి.
సిలబస్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రిలిమ్స్లో ఉన్న ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేట్ వాల్యూస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పర్ముటేషన్-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రెటేషన్,అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి.
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ప్రిలిమ్స్, మెయిన్స్.. రెండిట్లోనూ రీజనింగ్ ఉంది. ఎస్బీఐ పీవో రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్మెంట్ సంబంధ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవిగా అనిపించేలా ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5- నుంచి 10 ప్రశ్నలు రావొచ్చు.
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెటేషన్: మెయిన్స్లోని ఈ టాపిక్ కోసంఅర్థమెటిక్ టాపిక్స్ బాగా ప్రిపేర్ కావాలి.టేబుల్స్, లైన్ గ్రాఫ్లు, బార్ డయాగ్రమ్లు, పై చార్టులు, కేస్లెట్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలగాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మార్కులు ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ప్రిలిమ్స్, మెయిన్స్లతో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్లోనూ ఈ టాపిక్ ఉన్నందున దీనిపై అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రామర్పై ఎక్కువగా పట్టు పెంచుకోవాలి. ప్యాసేజీని వేగంగా చదివి, అర్థం చేసుకోగలిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు త్వరగా సాధించవచ్చు.
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్: కరెంట్ అఫైర్స్, బ్యాకింగ్ టర్మినాలజీ, స్టాండర్డ్ జీకేల నుంచి ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గత ఐదారు నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.bankofindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్
ప్రిపరేషన్ ప్లాన్
ఇప్పటికే బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అదే ప్రిపరేషన్తో ఈ పరీక్షను కూడా రాయవచ్చు. తాజాగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకునే వారు పరీక్ష సిలబస్ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇచ్చిన సిలబస్లో బేసిక్ అంశాలతో ప్రిపరేషన్ మొదలు పెడితే.. అనంతరం ఆయా అంశాలపై పట్టు సాధించడం సులువు అవుతుంది.
ప్రిపరేషన్లో భాగంగా ఎక్కువగా మాక్ టెస్టులను రాయాలి. వీలైనన్నీ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించడమే కాకుండా.. నిర్ణిత సమయంలో వేగంగా సమాధానాలు గుర్తించడానికి సన్నద్ధత లభిస్తుంది. కష్టమనిపించే అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. మాక్ టెస్టుల్లో చేసే తప్పులను గుర్తించి.. అవి పునరావృత్తం కాకుండా చూసుకోవాలి. నెగిటివ్ మార్కుల నిబంధన ఉన్నందున తెలియని ప్రశ్నలను వదిలేయడం మంచిది. ఎందుకంటే.. వాటితో సమయం వృథా అవుతుంది. ఆబ్జెక్టివ్ పరీక్షతోపాటు డిస్క్రిప్టివ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్లోనే దాన్ని కూడా భాగం చేసి ప్రాక్టీస్ చేయాలి.
డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీని తర్వాత రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రధానమైంది. ఈ రెండు విభాగాల్లో మెరుగైన మార్కులు పొందినవారు మాత్రమే తర్వాత దశకు చేరుకోగలుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి షార్ట్కట్ మెథడ్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలి.
గత పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలతోపాటు వీలైనన్ని ఎక్కవ మాక్టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులను రాయాలి. దీని ద్వారా ఆయా అంశాలపై ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తుంది.
పీజీడీబీఎఫ్ కోర్సు
తుది ఎంపికలో అర్హత సాధించిన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ఏప్రిల్ మొదటి వారంలో మణిపాల్ క్యాంపస్లో ప్రారంభమవుతుంది. కోర్సులో నాలుగు ట్రై మిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు ట్రై మిస్టర్లకు నెలకు రూ.2500 స్టయిపెండ్గా చెల్లిస్తారు. చివరి ట్రైమిస్టర్లో ఏదైనా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది.విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్ మేనేజర్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. కనీసం మూడేళ్లు విధుల్లో కొనసాగుతామని రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత గడువు తీరిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అలాగే సంస్థలో ఐదేళ్లు సర్వీస్ పూర్తిచేసుకున్న వారికి కోర్సు ఫీజు కూడా వెనక్కి ఇచ్చేస్తారు.