
బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు పాలై రాష్ట్రంలో 2024లో వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ చావులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు పరోక్ష కారణం అని చెప్పక తప్పదు. బెట్టింగ్ యాప్స్కు బలైన వాళ్లలో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు.
ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో యాప్స్ను ప్రమోట్చేయించుకుంటూ.. సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్యాప్స్వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నది. వీటిని ప్రమోట్చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
బెట్టింగ్ యాప్స్తో అప్పుల పాలై కుటుంబాలు రోడ్డు మీదికి వస్తుండగా.. కొందరు అప్పులు తీర్చే మార్గాలు తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూ ట్యూబ్లో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ను, గేమింగ్యాప్స్ను ప్రమోట్ చేయడంతో వాటి బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది.
ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవాళ్లు ప్రమోట్ చేస్తుండటంతో.. వాళ్లు చెప్పింది నమ్మి డబ్బులకు ఆశపడి ముఖ్యంగా యువత ఆ యాప్స్లో డబ్బులు పెడ్తున్నారు. మొదట్లో కొంత మొత్తం ఆయా యాప్స్ నుంచి వస్తుండటంతో.. అందుకు ఆశపడి అదే పనిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టాలపాలవుతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Also Read:-బెట్టింగ్ యాప్స్కు వెయ్యి మంది బలి.. ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత
ఇలా 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు ‘వెలుగు’కు తెలిపాయి. పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగులు పెరిగిపోయాయి. చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ యాప్స్కు అడిక్ట్ అవుతున్నారు. పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశలకు.. అప్పులు చేసి మరీ డబ్బులు పెడ్తున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మద్దతుగా నిలిచారు. ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచిస్తున్నారు. #SayNoToBettingAppsకు అందరూ కలిసి రావాలని కోరుతున్నారు.