
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. బార్ అసోసియేషన్ పాలకవర్గం పదవీ కాలాన్ని రెండేండ్లపాటు పొడిగించాలన్న అభ్యర్థనను రాష్ట్ర బార్ కౌన్సిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్తో పాటు మరో 24 అసోసియేషన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
దీనిపై జస్టిస్ బీవీ విజయ్సేన్రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బార్ అసోసియేషన్ల ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. రాష్ట్ర బార్ కౌన్సిళ్ల కార్యదర్శులకు 2015లోనే లేఖ రాసినా పట్టించుకోవడంలేదన్నారు. మార్చి 31న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఎన్నికలపై స్టేటస్ కో కొనసాగించేలా ఉత్తర్వులివ్వాలని కోరగా న్యాయమూర్తి నిరాకరించారు.