
భద్రాచలం, వెలుగు: ‘మఢ్ బచావో అభియాన్’ విజయవంతం అయిందని బస్తర్ డీఐజీ కేఎల్ ధ్రువ్, నారాయణ్పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఆదివారం వారు మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు తెలిపారు. మావోయిస్టుల నుంచి మూల ఆదివాసీలు జీవించే అబూజ్మఢ్ ప్రాంతాన్ని రక్షించేందుకు ‘మఢ్ బచావో అభియాన్’ ప్రారంభించామని తెలిపారు. దీనిలో భాగంగా తమ బలగాలతో శనివారం కుతుల్ ప్రాంతంలో గాలింపు చేపడుతుండగా.. ఎన్కౌంటర్ జరిగిందని, ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 8 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. మృతులను సుద్రూ, వర్గేశ్, మమత, సమీరా, కోశీ, మోతీగా గుర్తించామని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక ఇన్సాస్ తుపాకీ, రెండు 303 రైఫిల్స్, మూడు 315 బోర్ రైఫిల్స్, ఒక బీజీఎల్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ను నితీష్ ఎక్కాగా గుర్తించామని, లేఖ్రాం నేతాం, కైలాష్ నేతం అనే జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు.