దుబాయ్‎లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు

దుబాయ్‎లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు

ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ ఇంటింటా రంగురంగుల పూలతో జరుపుకోనే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించే దుబాయిలోనూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కైరో స్ట్రీట్‎లోని ఇత్తెహాద్ స్కూల్ గ్రౌండ్‎లో తెలంగాణ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో లెవ‌ల్ నెక్ట్స్ గోల్డ్ ఈవెంట్స్ దుబాయ్, గ‌ల్ఫ్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన  బతుకమ్మ పండుగను సంబరంగా జ‌రుపుకున్నారు. 

ముఖ్య అతిధులుగా ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్  పాల్గొన్నారు. మ‌హిళ‌లు పూలతో బతుకమ్మలు పేర్చి భక్తి శ్రద్ధలతో  గౌరీ పూజ‌లు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటపాటతో దుబాయ్ న‌గ‌రం పుల‌కించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లు మార్మోగాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ  గల్ఫ్‌ దేశంలో నివసిస్తున్న మనవారంత ఒక కుటుంబంలా కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంద‌న్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండగ‌ని, ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే వుందని తెలిపారు. 

Also Read :- వరంగల్‎లో విషాదం.. పిడుగు పాటుకు ఇద్దరు రైతులు మృతి

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనదని.. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటు వంటి కార్యక్రమాలు దానికి ఎంతో తోడ్పడుతాయ‌ని చెప్పారు. 

విదేశాల్లో స్థిర‌ప‌డ్డ ప్రవాస భార‌తీయులు.. మ‌న దేశ ఆర్థిక వ్యవ‌స్థకు బ‌ల‌మైన పునాదులు వేస్తున్నార‌ని అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో మెరుగైన, నాణ్యమైన విద్యా, ఆధునిక సేవ‌లు వంటి వాటికి పారిశ్రామిక‌వేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు చేయూత నివ్వాలని కోరారు. సామాజిక బాధ్యతగా పేద విద్యార్థుల‌కు విద్యనందించేందుకు త‌మ వంతు సాయం చేయాల‌ని సూచించారు.