
పుల్కల్, వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని మనస్తాపంతో శుక్రవారం ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడ్డాడు. కాలు విరిగి తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు కావాలని స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో పాటు సంబంధిత ఆఫీసర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన బట్టు చిరంజీవి రాజు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నాడు. ఈ క్రమంలో పుల్కల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సును అడ్డగించి కొంతసేపు పెట్రోల్ బాటిల్తో ధర్నా చేశాడు. ఉన్నట్టుండి అక్కడి నుంచి లేచి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడుతుండగా అప్పటికే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాజు లేచింది చూసి బస్సును ముందుకు కదిలించాడు.
ఇది గమనించిన రాజు డ్రైవర్పై అరుస్తూ బస్సుకు అడ్డంగా వెళ్లి సూసైడ్ చేసుకోబోయాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్న రాజు కాలి నుంచి బస్సు టైరు వెళ్లింది. ఈ ఘటనలో అతడి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే రాజును సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కాలి గాయం ఎక్కువ కావడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం రాజు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా బస్సు డ్రైవర్ జగదీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.