
న్యూ ఢిల్లీ, వెలుగు: చట్ట సభలలో మహిళలకు కేటాయించిన 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్కోటా కేటాయించాలని కేంద్రాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ఢిల్లీ తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్ అధ్యక్షతన ‘అఖిల భారత బీసీ మహిళా సెమినార్’ ను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఈటల రాజేందర్, మాజీ ఎంపీ అజీజ్పాషాతో పాటు బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, డాక్టర్ పద్మలత, గుజ్జ సత్యం, రాజ్యలక్ష్మితో తదితరులు నేతలు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై సదస్సులో చర్చించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటు-లో ఆమోదం పొందిన మహిళా బిల్లులో జనాభా ప్రకారం బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. బీసీలు అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారన్నారు. చట్టంతోనే బీసీలకు, మహిళలకు న్యాయం దక్కుతుందని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లతో పాటు- విద్యా, ఉద్యోగాలలో కూడా బీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కోరారు.