
- 42 శాతం రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం అభినందనీయం
హైదరాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేబినేట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ అన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని, బీసీల కలలు సాకారమయ్యే సమయం వచ్చిందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు. శుక్రవారం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో మెంబర్లు బాలలక్ష్మి, సురేందర్, జయప్రకాశ్తో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి.
ఈ అంశంపై ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లినప్పుడు అందరూ ఏకతాటిపైకి వచ్చేలా అన్ని పార్టీల నేతలు చొరవ చూపాలి. బీసీ రిజర్వేషన్లను కోఆపరేటివ్ సోసైటీలకు వర్తింపజేయాలి. అందుకోసం అవసరమైన సవరణలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాదించి, ఆమోదించాలి” అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులకు కులాల వారీగా అందిస్తున్న స్కాలర్షిప్ వివరాలను తెలపాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ( సీజీజీ) డైరెక్టర్ జనరల్కు లేఖ రాశామని నిరంజన్ వెల్లడించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో వివిధ సామాజిక వర్గాల స్టూడెంట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కాలర్షిప్ వివరాలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు. కులగణన రీ సర్వేలో తీసుకున్న సమాచారాన్ని కూడా అందించాలని ప్లానింగ్ డిపార్ట్మెంట్ను కోరామని చెప్పారు.