పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్​గౌడ్

పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్​గౌడ్
  •      బీసీ నేత జాజుల శ్రీనివాస్​గౌడ్ డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు : టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​చేశారు. జనాభా ధామాషా పార్టీలోని పదవులను బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీని కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు లేదంటూ బీసీలకు సీట్లు ఇవ్వలేదని, లోక్​సభ ఎన్నికల్లోనూ అదే చెప్పారని అసహనం వ్యక్తం చేశారు.

బీసీల ఓట్లతోనే రేవంత్​రెడ్డి సీఎం అయ్యారనే విషయం మరిచిపోకూడదన్నారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మంత్రి పదవులు కేటాయించాలని, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణి మంజరి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్​ ముదిరాజ్​పాల్గొన్నారు.