
న్యూఢిల్లీ: టీమిండియా సూపర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో టాప్ గ్రేడ్ను నిలబెట్టుకున్నారు. ఈ ఇద్దరితో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అత్యధిక వేతనం లభించే ఎ– ప్లస్ గ్రేడ్లో కొనసాగిస్తున్నట్టు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తంగా 34 మంది క్రికెటర్లతో వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల వేసింది.
గతేడాది దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న ఆరోపణలతో కాంట్రాక్టుల నుంచి తప్పించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను కూడా తిరిగి తీసుకోవడం గమనార్హం. కొత్తగా తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా సహా ఐదుగురు ప్లేయర్లకు చాన్స్ ఇచ్చింది.
బీసీసీఐ నాలుగు కేటగిరీల్లో కాంట్రాక్ట్లు అందిస్తోంది. ఎ– ప్లస్ కేటగిరీలోని ప్లేయర్లు ఏడాదికి అత్యధికంగా రూ.7 కోట్లు అందుకుంటారు. ఆ తర్వాత ఎ– కేటగిరీకి రూ. 5 కోట్లు, బి– కేటగిరీకి రూ. 3 కోట్లు, సి కేటగిరీకి రూ. 1 కోటి లభిస్తాయి. గంభీర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో చర్చల తర్వాత నేషనల్ సెలెక్టర్లు రెండు వారాల క్రితమే ఈ లిస్ట్ను రెడీ చేసినట్లు సమాచారం.
గతేడాది కాంట్రాక్టు నుంచి వేటుకు గురైనా చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ను ఈసారి బి–గ్రేడ్లోకి తీసుకున్న బీసీసీఐ వికెట్ కీపర్ -బ్యాటర్ ఇషాన్ కిషన్ను సి–గ్రూప్లో చేర్చింది. యాక్సిండెంట్ నుంచి కోలుకొని వచ్చిన తర్వాత గత సీజన్లో ఆటకు దూరంగా ఉండటంతో బి–గ్రేడ్కి పడిపోయిన రిషబ్ పంత్ ఈసారి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో తిరిగి గ్రేడ్–ఎలోకి వచ్చాడు.
గ్రేడ్–సిలో కొత్త క్రికెట్లర్లు
గ్రేడ్ –సిలో కొత్తగా నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా లాంటి ఆటగాళ్లు చోటు సంపాదించారు. ఈ ఇద్దరూ 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్లకు కూడా సెలెక్టర్లు చాన్స్ ఇచ్చారు. నేషనల్ టీమ్లో చోటు కోల్పోయిన సీనియర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అతనితో పాటు పేసర్ అవేశ్ ఖాన్, కీపర్ కేఎస్ భరత్, జితేష్ శర్మను కూడా ఈ ఏడాది కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించారు.
సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చేదిలా..
బీసీసీఐ ప్రతి ఏడాది ఆటగాళ్ల గత సీజన్ పెర్ఫామెన్స్ ఆధారంగా కాంట్రాక్ట్ ఇస్తుంది.మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడే వారికి ఎ–పస్ల్, టెస్టుల్లో రెగ్యులర్గా ఆడుతూ.. మిగతా ఫార్మాట్లకు అందుబాటులో ఉండేవాళ్లను ఎ–గ్రేట్లోకి తీసుకుంటుంది. రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్లకు బి–గ్రేడ్, కొత్తగా టీమిండియాలోకి వచ్చిన వాళ్లు లేదా ఒకే ఫార్మాట్లో ఆడే వాళ్లకు సి–గ్రేడ్ ఇస్తుంది. రోహిత్, కోహ్లీ, జడేజా టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ గతేడాది జూన్లో టీ20 వరల్డ్ కప్లో పాల్గొన్నారు. టెక్నికల్గా గత సీజన్లో మూడు ఫార్మాట్ల ప్లేయర్లు కావడంతో ముగ్గురూ ఎ–ప్లస్ గ్రేడ్లోనే ఉన్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
సెంట్రల్ కాంట్రాక్టుల లిస్ట్:
ఎ ప్లస్ (రూ.7 కోట్లు) : రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా; ఎ (రూ. 5 కోట్లు): సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్;
బి (రూ.3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్; సి (రూ. 1 కోటి): రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.