
న్యూఢిల్లీ: ఐపీఎల్–18కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ సందర్భంగా బాల్పై ఉమ్మి (సలైవా) రుద్దడంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. గురువారం జరిగిన కెప్టెన్ల సమావేశంలో చాలా మంది సలైవా ఉపయోగించుకోవడానికే ఓటు వేశారు. దీంతో ఈ సీజన్ నుంచే దీన్ని అమలు చేసేందుకు బీసీసీఐ అంగీకరించింది. ‘సలైవా ఉపయోగించుకోవాలా? వద్దా? అనేది కెప్టెన్ల నిర్ణయం. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేం దీనికి అంగీకరిస్తున్నాం. అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం’ అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.
కరోనా వైరస్ కారణంగా 2020 నుంచి బాల్పై ఉమ్మి రుద్దడాన్ని బీసీసీఐ నిషేధించింది. ఇక రాత్రి జరిగే మ్యాచ్ల్లో రెండో ఇన్నింగ్స్లో రెండు బాల్స్ను ఉపయోగించుకునేందుకు కూడా బీసీసీఐ అనుమతించింది. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో బౌలర్లకు బంతిపై పట్టు దొరికేది కాదు. ఇప్పుడు రెండో బాల్ అందుబాటులోకి రావడంతో బౌలర్లకు పండుగే అని చెప్పొచ్చు.
అయితే రెండో ఇన్నింగ్స్లో 11వ ఓవర్ తర్వాతే కొత్త బంతిని వాడాలి. బాల్ను మార్చాలా? వద్దా? అనే దానిపై అంపైర్లే తుది నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లకు ఈ రూల్ వర్తించదు. ఇక ఇంపాక్ట్ రూల్ను కూడా కొనసాగించనున్నారు. స్లో ఓవర్ రేట్కు పాల్పడే కెప్టెన్లపై ఎలాంటి మ్యాచ్ నిషేధం ఉండదని బీసీసీఐ వెల్లడించింది. డీమెరిట్ పాయింట్లు విధించనుంది. కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో బ్యాన్ ఉంటుందని బోర్డు తెలిపింది.
ఆర్ఆర్ తొలి 3 మ్యాచ్ల్లో పరాగ్కు కెప్టెన్సీ..
రాజస్తాన్ రాయల్స్ ఆడబోయే తొలి మూడు మ్యాచ్లకు సంజూ శాంసన్ ప్లేస్లో రియాన్ పరాగ్ను కెప్టెన్గా ప్రకటించారు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న శాంసన్పై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో శాంసన్ కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు.