
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ విష్ణు ప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. విష్ణుప్రియ అడ్వకేట్తో కలిసి పంజాగుట్ట పీఎస్కు వెళ్లింది. ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులిచ్చారు. ఇవాళ(గురువారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కానిస్టేబుల్ కిరణ్గౌడ్ విచారణకు హాజరయ్యాడు.
ఆసిఫ్నగర్ పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్గౌడ్ యూట్యూబర్ ఇమ్రాన్ఖాన్తో కలిసి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడు. దీంతో పోలీసులు అతని పైనా కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. హీరో, హీరోయిన్లలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హర్ష సాయి, ఇమ్రాన్లు దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా వీరి బెట్టింగ్ యాప్స్ కంపెనీల వివరాలు.. ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా పోలీసులు సేకరించనున్నారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేయాలని పోలీసులు డిసైడ్ కావడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బ్యాచ్కు భయం పట్టుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.
Also Read:- విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిపై కేసు నమోదు..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన యూట్యూబర్స్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నోటీసులకు హాజరుకాకపోతే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. విచారణకు ఎవరెవరు వస్తారు.. ఎవరు డుమ్మా కొడతారు అనేది తెలియాల్సి ఉంది. నోటీసుల అనంతరం సమయం కోరిన వారికి టైం ఇస్తామని.. కానీ పూర్తిగా హాజరుకాని వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం కూడా వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు.