
- సర్వేల పేరుతో కాలయాపన
- నేషనల్హైవే అథారిటీస్ కొర్రీలతో తలనొప్పి
- ముచ్చటగా మూడోసారి సాయిల్ టెస్ట్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శివారున కూనవరం రోడ్డులో కరకట్ట పనులు ముందుకు సాగడం లేదు. సర్వేల పేరుతో కాలయాపన జరుగుతోంది. నేషనల్ హైవేను కరకట్టను దాటించే క్రమంలో చేపట్టబోయే ఎలివేటెడ్ రోడ్డు పనులకు సాయిల్ టెస్ట్ కావాలంటూ నేషనల్ హైవే అథారిటీ సూచించింది. ఇప్పటికే అనేకసార్లు సాయిల్ టెస్టులు చేసి పంపినా కొర్రీలు పెడుతుండటంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తలనొప్పిగా మారింది. నవంబరు నెలలో ఒకసారి బోర్హోల్ డిగ్గింగ్ ద్వారా టెస్ట్ చేసి రిపోర్టు ఇస్తే ఇంకా అక్యురేట్గా కావాలంటూ పెండింగ్లో పెట్టారు.
దీంతో గత నెలలో బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో జియో ఫిజికల్ సర్వే నిర్వహించారు. 1.3 కిమీల పరిధిలో సాయిల్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చినా నేషనల్ హైవే అథారిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి చేయించాలని పేర్కొనడంతో తిరిగి బోర్ హోల్ డిగ్గింగ్ ద్వారా శనివారం నుంచి సాయిల్ టెస్ట్ ప్రారంభించారు.
రూ.40కోట్ల అదనపు నిధులతో పనులు
గతంలో 3.4 కి.మీల కరకట్ట నిర్మాణం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 ఎకరాలను సేకరించారు. ఇందులో 700 మీటర్ల మేర పనులు ఆగిపోయాయి. వాటిని కొత్తగా వచ్చిన కాంగ్రెస్సర్కారు చేపట్టింది. రూ.38కోట్లతో పనులు ప్రారంభించారు. 2024 జూన్నెలలో నేషనల్ హైవేస్ ఇంజినీర్ఇన్ చీఫ్ గణపతిరెడ్డి కరకట్టను నేషనల్ హైవే దాటిస్తున్నందున ఈ పనులు పరిశీలనకు వచ్చారు. ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణం తప్పనిసరి అంటూ సూచించారు. దీంతో మరో రెండున్నర ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది. రూ.40కోట్లతో కరకట్టపై ఫ్లైఓవర్ తరహాలో ఎలివేటెడ్ రోడ్డును నిర్మించాల్సి వచ్చింది. అందుకే నేషనల్హైవేస్ అథారిటీస్ సాయిల్ టెస్టు రిపోర్టులు అడుగుతోంది. పాత కరకట్ట బేస్ 53 మీటర్లు ఉండగా కొత్తగా నిర్మిస్తున్నది 65 మీటర్ల వరకు ఉంటుంది. గతంలో కరకట్ట ఎత్తు 12.50 మీటర్లు ఉంటే ఇప్పుడు 13 మీటర్లు ఎత్తు
ఉంటుంది.
ఈ రిపోర్టు కీలకం
సాయిల్ టెస్ట్ రిపోర్టు ప్రకారమే ఎలివేటెడ్ రోడ్డుకు పునాది నిర్మాణం జరుగుతుంది. వరదల కారణంగా ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున గోదావరి తీరం వెంట ఉన్న ఈ ప్రాంతంలో పునాది నిర్మాణానికి ఎంత లోతులో రాతి పొరలు ఉన్నాయనే విషయం తెలియాలంటే ఈ రిపోర్టు కీలకం. అందుకే జాగ్రత్తలు తీసుకుని ఇన్ని సార్లు టెస్ట్ చేయిస్తున్నాం. తప్పకుండా ఈసారి నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి అనుమతులు వస్తాయి. ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తాం.
- రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్, భద్రాచలం