రామాలయ అభివృద్ధికి లైన్ క్లియర్​

రామాలయ అభివృద్ధికి లైన్ క్లియర్​
  • భూసేకరణకు రూ.34కోట్లను రిలీజ్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి లైన్​ క్లియర్​ అయ్యింది. ఆలయం చుట్టూ ఉన్న భూమిని సేకరించేందుకు రెవెన్యూశాఖ ద్వారా ఇప్పటికే ఇళ్ల యజమానులతో మాట్లాడి వారి నుంచి అంగీకారం తీసుకుని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గతంలో జీవో నెంబర్​ 246 ద్వారా రూ.60.20కోట్ల ఎస్​డీఎఫ్​నిధులు ఇచ్చిన సంగతి విదితమే. కలెక్టర్​ నివేదిక ప్రకారం ప్రభుత్వం రూ.34కోట్లను జీవోను విడుదల చేస్తూ జీవో నెంబర్​ 93ను రిలీజ్​ చేసింది. 

మరో రెండు మూడు రోజల్లో 45 ఇండ్ల చెందిన యజమానులకు పరిహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్డీవో వెల్లడించారు. ఆలయం చుట్టూ ఉన్న భూ నిర్వాసితులతో ఆర్డీవో దామోదర్​ మంగళవారం తన చాంబరులో మీటింగ్​ నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందరికీ ఇస్తామని సూచించారు. కాగా పరిహారం తీసుకునేందుకు అంగీకరించిన ఇండ్ల యజమానులు ఖాళీ చేసేందుకు కొంత సమయం కావాలన్నారు. 

సీఎంతో భేటీతో కదలిక

ఇటీవల శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్​రెడ్డిని ఆహ్వానించేందుకు హైదరాబాద్​కు ఈవో రమాదేవి, వైదిక బృందం వెళ్లారు. ఆహ్వానపత్రిక తీసుకున్నాక ఆలయ అభివృద్ధి గురించి ఆయన చర్చించారు. భూసేకరణ వివరాలు సీఎంకు వివరించగా నివేదికలు పరిశీలించేందుకు మరుసటి రోజు రావాలని ఆదేశించారు. ఈవో రమాదేవి పూర్తి వివరాలతో ప్రిన్సిపల్​ సెక్రటరీ శైలజారామయ్యర్​, ఎండోమెంట్ కమిషనర్​ శ్రీధర్ తో పాటు సీఎంను కలిశారు. ఆయన గ్రీన్​సిగ్నల్​ ఇచ్చి రూ.34కోట్లను రిలీజ్​ చేశారు. కాగా, భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధులు మంజూరయ్యాయి. శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్​ రెడ్డితో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజను చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.