పథకాలు పకడ్బందీగా అమలు కావాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

పథకాలు పకడ్బందీగా అమలు కావాలి : కలెక్టర్  జితేశ్ వి పాటిల్
  •     భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్  జితేశ్ వి పాటిల్

చండ్రుగొండ, వెలుగు : ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్ల ను ఆదేశించారు. గురువారం మండలంలోని దామరచర్ల, అయ్యన్నపాలెం, చండ్రుగొండ గ్రామాల్లో ఆయన విస్తృత పర్యటన చేశారు. ఎంపీడీవో ఆఫీసులో గృహజ్యోతి పథకం దరఖాస్తుల్లో తప్పులను సరిచేసేందుకు ఉపయోగిస్తున్న ఎడిటింగ్ ఆప్షన్ ను  కలెక్టర్​ పరిశీలించి పలు సూచనలు చేశారు.  పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ తనూజతో మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.  

గ్యాస్ సబ్సిడీ, జీరో బిల్లు అమలుపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. చండ్రుగొండ జడ్పీహెచ్ఎస్​ఆవరణలో నిల్చిన వరద నీరును పరిశీలించారు. చండ్రుగొండ నుంచి జూలూరుపాడు రోడ్డు లో డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.12 కోట్ల నిధులు మంజూరైనా పనులు ప్రారంబించలేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు సంధ్యారాణి, ఎంఈవో సత్యనారాయణ, ఎపీవో సంతోష్, పీఆర్ డీఈ సత్యనారాయణ,, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.