
గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సాకుతో పెన్నా బేసిన్కు ఆయువుపట్టుగా ఉన్న బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మరింత విస్తరించే కుట్ర పన్నుతున్నది. ఇందుకోసం 2005లో పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలోనే బనకచర్ల విస్తరణకూ ఇచ్చిన జీవో 305 దుమ్ముదులుపుతున్నది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని బనకచర్ల హెడ్రెగ్యులేటర్ కెపాసిటీని పెంచడంతోపాటు అక్కడి నుంచి ప్రారంభమయ్యే కెనాల్స్ విస్తరణ, లైనింగ్ పనులకు రెడీ అవుతున్నది.
ఎస్ఆర్బీసీకి లైనింగ్
పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటిని తీసుకొచ్చే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్(ఎస్ఆర్ఎంసీ) లైనింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ పనులు పూర్తయితే 90 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఈ కెనాల్సామర్థ్యం కాస్తా లక్షన్నర క్యూసెక్కులకు పెరుగుతుంది. అందుకు తగ్గట్టు బనకచర్ల రెగ్యులేటర్ ను విస్తరించడంతోపాటు దిగువన ఉన్న శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్, తెలుగు గంగ కాల్వల కెపాసిటీని కూడా పెంచాలని ఏపీ భావిస్తున్నది. ఉదాహరణకు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఆర్ బీసీ) కెపాసిటీ11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని సామర్థ్యాన్ని పెంచాలని సీమ నేతల నుంచి చాలా ఏండ్లుగా డిమాండ్లు ఉన్నాయి. దీంతో ఎస్ఆర్బీసీ లైనింగ్పనులు చేపట్టనున్నట్టు 2015లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
నాడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు జీబీ లింక్ను ముంగటేసుకున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్బీసీ లైనింగ్కు సంబంధించి పాత ఫైలు దుమ్ము దులుపుతున్నది. ఈ లైనింగ్ పనులు పూర్తయితే కాల్వ కెపాసిటీ 22 వేల క్యూసెక్కులకు పెరుగుతుంది. అంటే ఎస్ఆర్బీసీ ద్వారా ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ తీసుకెళ్తుండగా, ఇకపై 2 టీఎంసీలు తీసుకెళ్తారన్నమాట! ఇలాగే మిగిలిన 3 కాల్వల విస్తీర్ణం పెంచడంతోపాటు లైనింగ్ పనులు పూర్తిచేసి ప్రతిరోజూ 18 టీఎంసీల వాటర్ను తరలించే కెనాల్ సిస్టమ్ను ఏపీ సర్కారు రాబోయే రోజుల్లో సిద్ధం చేసి పెట్టుకోబోతున్నది. ప్రస్తుతం దొంగతనంగా ఈ నీటిని ఎత్తుకెళ్తున్న ఏపీ, ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, ఆయకట్టు రెడీ చేసిపెట్టుకున్నాక ఆ నీళ్లన్నీ తన హక్కుగా రావాల్సినవని ట్రిబ్యునల్స్లో కొట్లాడే అవకాశం ఉంటుందని తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అంత దూరం రాకముందే ఏపీ సర్కారు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.