సరళంగా ఆలోచిస్తేనే సైన్స్​ ఆవిష్కరణలు : ఎండీ కృష్ణ ఎల్లా

సరళంగా ఆలోచిస్తేనే సైన్స్​ ఆవిష్కరణలు : ఎండీ కృష్ణ ఎల్లా
  • భారత్​ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సైన్స్​గురించి సరళమైన భాషలో ఆలోచిస్తే ఉత్తమ ఆవిష్కరణలు కనుగొనవచ్చని పద్మభూషణ్​అవార్డు గ్రహీత, భారత్​బయోటెక్​వ్యవస్థాపకుడు డాక్టర్​ కృష్ణ ఎల్లా తెలిపారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​వర్సిటీలో శుక్రవారం సైన్స్​ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గీతం ఛేంజ్ మేకర్స్​ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గీతం నెలకొల్పిన మల్టీడిసిప్లీనరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్​ఆన్​ ట్రాన్సేషనల్​ పరిశోధనా కేంద్రాన్ని గీతం ప్రెసిడెంట్  శ్రీభరత్​ మతుకుమిల్లి, చాన్స్​లర్ వీరేందర్ సింగ్ చౌహాన్​తో కలిసి ఎల్లా ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశం12 నుంచి15 శాతం జీడీపీ వృద్ధిని సాధించాలంటే అది సైన్స్​ఆవిష్కరణలతోనే సాధ్యమన్నారు. అందుబాటులో ఉన్న శాస్ర్తీయ జ్ఞాన సంపదను గుర్తించి, సైన్స్​ ప్రాథమిక సూత్రాలను స్వీకరించాలని యువ పరిశోధకులకు సూచించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన భారత్​ బయోటెక్​ ప్రయాణం ప్రస్తుతం నాలుగు వేల మందితో ఐదు ప్రదేశాలకు విస్తరించిందని వివరించారు. క్లినికల్​ పరిశోధనలతోనే వాక్సిన్​ను ఆవిష్కరించ గలిగామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ పూర్వ డైరెక్టర్ చంద్రశేఖర్, వివిధ సంస్థల పరిశోధనా ప్రతినిధులు పాల్గొన్నారు.