ఏడు మండలాల విలీనానికి కారణం బీఆర్ఎస్: భట్టి విక్రమార్క

ఏడు మండలాల  విలీనానికి కారణం బీఆర్ఎస్: భట్టి విక్రమార్క

ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడానికి కారణం బీఆర్ఎస్సేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  రాష్ట్ర విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే ఏడు మండలాలు ఏపీలో కలిపారని చెప్పారు. ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలన్నారు.  హరీశ్ రావు టైంపాస్ మాటలు బంద్ చేయాలని కౌంటర్ ఇచ్చారు.  కేసీఆర్ చేసిన తప్పులు  చెయ్యబోమని చెప్పారు.

రుణమాఫీపై బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలన్నారు భట్టి విక్రమార్క.  త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.  గత సర్కార్ లక్ష కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు.  రుణమాఫీపై మాటతప్పేది లేదన్నారు. తాము  ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసాపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు  చేస్తామని చెప్పారు.

ప్రజలు కట్టిన ప్రతీ పైసా రాష్ట్రాభివృద్దికే ఉపయోగిస్తామన్నారు. త్వరలోనే జాబ్  క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. భూ వివాదం కారణంగా  ఆత్మహత్య చేసుకున్న రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు. రైతు  ఆత్మహత్యకు కారణమైన ఎవర్నీ వదిలిపెట్టబోమన్నారు భట్టి. 

ఏపీలో కలిపిని ఏడు మండలాలను వెనక్కి తీసుకొచ్చిన తర్వాతే ఇతర విభజన  సమస్యలపై ముందుకెళ్లాలని..దిగువ సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కేలా చూడాలిని  హరీశ్ రావు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే..