
భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్ 181, 182, 194. 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తోపాటు సబ్రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లతోపాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఆర్డర్స్ ఇచ్చే దాకా ఈ ల్యాండ్స్ను అన్యాక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్దాఫీసర్లు ఉండటంతో పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ను అనుమతించొద్దని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.
నోటీసులు వీరికే..
దాదాపు 30 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, వారి కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయినవారిలో ఐఏఎస్లు నవీన్ మిట్టల్, అమోయ్కుమార్, రాజశ్రీ షా, అజయ్జైన్, హరీశ్, ఐపీఎస్లు మహేశ్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్ జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, ఏకే మహంతి, కుటుంబ సభ్యులు జ్ఞాన్ముద్ర (ఐఏఎస్ సోమేశ్కుమార్ భార్య), తాటిపత్రి పావనీరావు(తాటిపత్రి ప్రభాకర్రావు ఐపీఎస్ భార్య), ఐశ్వర్యరాజ్(ఐఏఎస్ వికాస్ రాజ్ కుమార్తె), వసుంధర సిన్హా(ఐఏఎస్ అంజనీకుమార్భార్య) , ఓం.అనిరుధ్ (రాచకొండ కమిషనర్ సుధీర్బాబు కుమారుడు), నందిని మాన్ (ఐపీఎస్ విక్రమ్సింగ్మాన్ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్ సందీప్ సుల్తానియా భార్య), వెన్నవెల్లి రాధిక (ఐపీఎస్ కమలాసన్రెడ్డి భార్య), నితేష్రెడ్డి (మాజీ డీజీపీ మహేందర్రెడ్డి కుమారుడు), రేఖా షరాఫ్ (ఐపీఎస్ ఉమేశ్ షరాఫ్ భార్య), రేణుగోయల్ (డీజీపీ జితేందర్ భార్య), దివ్యశ్రీ (ఐఏఎస్ ఆంజనేయులు భార్య), హేమలత (ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి భార్య), ఇందూ రావు కావేటి (ఐపీఎస్ లక్ష్మీనారాయణ కుమారుడు), సవ్యసాచి ప్రతాప్సింగ్ (ఐపీఎస్ గోవింద్సింగ్ కుమారుడు), పేర్ల వరుణ్ (ఐపీఎస్ విశ్వప్రసాద్ కుమారుడు) తదితరులు ఉన్నారు. తదుపరి విచారణను జూన్ 12కు హైకోర్టు వాయిదా వేసింది.