
- పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఇకపై ఇందులోనే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు
- ఇబ్బందుల అధ్యయనానికి మూడు మండలాల ఎంపిక
- కీసర, తిరుమలగిరి సాగర్, సదాశివపేటలో పరిశీలన
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. భూభారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు.. ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్నిరోజుల పాటు ఆటంకం ఏర్పడగా, ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో, ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి అప్టు డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు ఉండవు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకుముందు ఉన్న 33 మాడ్యుల్స్ను ఆరుకు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్పోర్టల్ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు.
దశలవారీగా చట్టం అమలు..
భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్లైన్స్ రెడీ చేసి, సోమవారం నుంచి దశలవారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టంలో మొత్తం 23 అంశాలు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ప్రతిదీ వెబ్ పోర్టల్కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడించి, ఒక్కోదాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. ఇప్పుడైతే రాష్ట్రవ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇకపై అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? అనేది తెలుసుకునేందుకు మూడు మండలాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో వంద శాతం భూసమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నది. ఇంతకుముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు.
అందుబాటులోకి అప్పీళ్లు.. ట్రిబ్యునళ్లు
ఇకపై రైతులు భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, యజమాని పేరు మార్పు చేయాలన్నా, వివాదాలపై అప్పీల్ చేయాలన్నా ఒకేచోట భూభారతిలో పరిష్కారం దొరుకుతుంది. ఇంతకుముందు కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆ విధానానికి చెక్పడింది. రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పులు సరిచేయడం లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు కూడా ఈ పోర్టల్ ద్వారా తేలిగ్గా పూర్తి కానున్నాయి. ఇవే కాదు.. భూమికి సంబంధించిన ఇతర సమాచారం కూడా అందుబాటులో ఉండనుంది. ఒక గ్రామంలో నిషిద్ధ భూముల వివరాలు తెలుసుకోవాలన్నా, సర్వే నంబర్ లేదా పట్టాదారు పాస్బుక్ నంబర్తో భూమి హక్కుల గురించి ఆరా తీయాలన్నా ఈ పోర్టల్లో లభించనున్నాయి. భూమి మార్కెట్ విలువను సర్వే నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. భూమిపై జరిగిన లావాదేవీల వివరాలను చూపే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) కావాలన్నా, రిజిస్టర్డ్ పత్రాల సమాచారం కావాలన్నా, ఈ పోర్టల్ ఒక్క క్లిక్తో అందిస్తుంది. భూమి సంబంధిత ఫీజులను ఆన్లైన్లో చెల్లించే ఈ–-చలాన్ సౌకర్యం కూడా తెచ్చారు.
భూభారతిని మంచి సంస్థకు అప్పగించాలి: సీఎం రేవంత్
భూభారతి చట్టం, పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మరోసారి రివ్యూ చేశారు. భూభారతి పోర్టల్ రైతులకు అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ‘‘ఈ వెబ్సైట్ కనీసం వందేండ్ల పాటు ఉంటుంది. దీన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. భద్రతా పరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఫైర్వాల్స్ ఏర్పాటు చేయాలి. ఎవరు హ్యాక్చేయడానికి వీల్లేకుండా.. పక్కాగా ఉండాలి” అని సూచించారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ను ఎన్ఐసీ నిర్వహిస్తున్నదని, అదే విధంగా భూభారతి నిర్వహణ బాధ్యతను కూడా విశ్వసనీయమైన సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని చెప్పారు. ‘‘భూభారతితో రైతులకు ఎన్నో ఏండ్లుగా ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకోవచ్చు. అవసరమైన సేవలను వేగంగా పొందవచ్చు” అని తెలిపారు. సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.