
భూపాలపల్లి అర్బన్, వెలుగు : ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై గురువారం కలెక్టరేట్లో మీటింగ్ నిరవహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ సరిగ్గా జరిగేలా చూడాలన్నారు. పోషక లోపాలు లేకుండా, రక్తహీనతకు గురికాకుండా ఐరన్ మందులు, పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని చెప్పారు. పిల్లల ఎదుగుదల లోపాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టీబీని ముందస్తుగానే గుర్తిస్తే నయం చేయొచ్చని, టీబీ సింప్టమ్స్ గల వారిని గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని, టీబీ నిర్మూలన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. ఎన్సీడీ స్క్రీనింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి అవసరమైన వారికి ట్రీట్మెంట్ అందించాలని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్, డయాలిసిస్ సెంటర్లను వినియోగించుకోవాలని సూచించారు. చెల్పూర్ పీహెచ్సీ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. రివ్యూలో డీఎంహెచ్వో మధుసూదన్, మెడికల్ సూపరింటెండెంట్ నవీన్ పాల్గొన్నారు.