
గద్వాల, వెలుగు: గద్వాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తో పాటు పాటు 15 మంది కౌన్సిలర్లు మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కౌన్సిలర్లు మాణిక్యమ్మ, గీతమ్మ, జయమ్మ, శ్రీమన్నారాయణ, గిరిజా బాయి, బంగి ప్రియాంక, అనిత, నరహరి గౌడ్, మహేశ్వరి, నాగరాజు, సీను, మహేశ్, లక్ష్మి, అరుణ, కృష్ణ, రజక రాము, శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు చెందిన ఒక ముఖ్య లీడర్ చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని, దీనికి చెక్ పెట్టేందుకే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునేందుకు స్కెచ్ వేశారని అంటున్నారు.