
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట సమీప అడవిలో పెద్దపులి కలకలం చెలరేగింది. బయక్కపేట గుత్తికోయ గూడేనికి చెందిన పోడియం సత్తయ్యకు చెందిన ఆవు ఈ నెల 11న మేత కోసం అడవికి వెళ్లింది. ఆవు తిరిగి రాకపోవడంతో సత్తయ్య గ్రామస్తులతో కలిసి అడవిలో గాలించగా ఓ చోట కళేబరం కనిపించింది.
దీంతో వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్వో ఎల్లయ్య, ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివారం ఆవు చనిపోయిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి... పెద్దపులి దాడి చేసినట్లు నిర్ధారించారు. ఆవు కళేబరం చుట్టుపక్కల పులి అడుగుజాడలను గుర్తించారు. బయ్యక్కపేట అడవిలో పెద్దపులి తిరుగుతుందని, ప్రజలు అలర్ట్గా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచించారు. చుట్టుపక్క గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై ప్రజలకు అవగాహన కల్పించారు. రైతులు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని చెప్పారు.