సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్.. ముడా స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్

సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్.. ముడా స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్

బెంగుళూర్: కర్నాటక రాజకీయాలను షేక్ చేస్తోన్న  మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముడా స్కామ్‎లో ఇప్పటికే రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరికొందరిపై కర్నాటక లోకాయుక్త విభాగంగా కేసు నమోదు చేసి విచారణకు సిద్ధమైంది. కేంద్ర దర్యా్ప్తు సంస్థ ఈడీ సైతం ముడా స్కామ్‎లో మనీలాండరింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై కేసు నమోదు చేసింది. 

త్వరలోనే కేసుకు సంబంధించిన విచారణ మొదలుకాబోతున్న తరుణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడానికి కారణమైన భూములను తిరిగి ఇచ్చేస్తానని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమె లేఖ రాశారు. వివాదానికి కారణమైన భూములను తిరిగి ముడాకి అప్పగిస్తానని ఈ లేఖలో ఆమె పేర్కొన్నారు. కాగా, ముడా స్కామ్ కేసు ఇప్పుడు రంజుగా మారుతోన్న తరుణంలో భూములు తిరిగి ఇచ్చేస్తానని సీఎం సతీమణి లేఖ రాయడం కన్నడ పాలిటిక్స్‎లో చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ | ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట

అసలు ముడా స్కామ్ కేసు ఏంటంటే..?

సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. అయితే దానికి ప్రతిఫలంగా అప్పట్లో సిద్ధరామయ్య  సీఎంగా ఉన్న టైమ్‎లో ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న తీర్పు వెలువరించారు. 

గవర్నర్ చట్టప్రకారమే విచారణకు ఆదేశించారని, అందులో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. అయితే తీర్పుపై రెండు వారాలు స్టే ఇవ్వాలని  సిద్ధరామయ్య తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోరగా.. తాను ఇచ్చిన ఆదేశాలపై తానే స్టే విధించలేనని జడ్జి తెలిపారు. కాగా, హైకోర్టు తీర్పుతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు ట్రయల్ కోర్టు లోకాయుక్తకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రయల్ ఆదేశాల మేరకు కర్నాటక లోకాయుక్త విభాగం సీఎం సిద్ధరామయ్య, అతడి సతీమణితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు రెడీ అయ్యింది. లోకాయుక్త ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఇదే కేసులో సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణిపై ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది.