
న్యూఢిల్లీ: నేషనల్హెరాల్డ్పత్రిక, ది అసోసియేటెడ్ జర్నల్స్లిమిటెడ్(ఏజేఎల్)కు సంబంధించిన మనీ లాండరింగ్కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూ.661 కోట్ల విలువచేసే స్థిరాస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. ఆ ఆస్తులు ఉన్న సంబంధిత రిజిస్ట్రార్కు నోటీసులను అందజేసినట్టు తెలిపింది.
అలాగే, ఢిల్లీ ఐటీవోలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా(ఈ) ప్రాంతంలో (ప్లాట్ నంబర్ 2, సర్వే నంబర్ 341), లక్నో బిశేశ్వర్ నాథ్ రోడ్ (ఆస్తి నంబర్ 1) వద్ద ఉన్న ఏజేఎల్ భవనంలో నోటీసులు అతికించినట్టు వెల్లడించింది. ఢిల్లీ, లక్నో ప్రాంగణాలను ఖాళీ చేయాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నది. ముంబైలోని నేషనల్హెరాల్డ్హౌస్బిల్డింగ్ వరకూ ఒక ఆప్షన్గా దాని అద్దెను ఈడీకి ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు కల్పించింది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 8, రూల్ 5(1) కింద ఈడీ ఈ చర్యలు తీసుకుంది. 2023 నవంబర్లో ఈడీ ఈ ఆస్తులను జప్తు చేయడంతోపాటు 90.2 కోట్ల షేర్స్ను అటాచ్ చేసింది.
ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..?
ఏజేఎల్, దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్ కంపెనీపై మనీ లాండరింగ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసుగా ప్రచారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియన్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడిన రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది.