
న్యూఢిల్లీ: యూఎస్, ఇండియా మధ్య ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదిరితే ఇరు దేశాల మధ్య వ్యాపారం మరింత పెరుగుతుందని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలోపు ట్రేడ్ డీల్ పూర్తవ్వొచ్చని అన్నారు. యూఎస్– ఇండియా మధ్య వ్యాపారాన్ని ఇంకో ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల (రూ.43.50 లక్షల కోట్ల) కు పెంచుకోవాలని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోదీ తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
అంతేకాకుండా ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరే, మల్టీ సెక్టార్ బైలేటర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ద్వైపాక్షిక ఒప్పందాల) ను ఈ ఏడాది చివరిలోపు కుదుర్చుకోవాలని నిర్ణయిచుకున్నారు. ‘ఈ ఏడాది చివరిలోపు ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునేలా ఓ ఒప్పందాన్ని ట్రంప్తో ప్రధాని మోదీ చేసుకున్నారు. ఈ డీల్తో ఇరు దేశాల్లోని బిజినెస్లకు నమ్మకం పెరుగుతుంది. సంపద సృష్టించడంలో కలిసి పని చేయడానికి వీలుంటుంది’ అని గోయెల్ వివరించారు.
సాధారంగా దేశాలు ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటే ఇవి చేసుకునే దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ భారీగా తగ్గుతుంది. సర్వీసెస్ సెక్టార్లో వ్యాపారాన్ని పెంచుకునేందుకు రూల్స్ సులభతరం అవుతాయి. ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మొదటి టెర్మ్లో ఇండియా, యూఎస్ మధ్య ఇలాంటిదే ఓ మినీ ట్రేడ్ డీల్ కుదిరింది. కానీ బైడెన్ ప్రభుత్వం వచ్చాక దీనిని క్యాన్సిల్ చేసింది. యూఎస్తో పాటు ఆస్ట్రేలియా, యూఏఈ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) బ్లాక్ వంటి వివిధ పార్టనర్లతో కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్ను ఇండియా కుదుర్చుకుంటోందని గోయెల్ అన్నారు. గ్లోబల్ లెవెల్లో ఇండియా ప్రాతినిధ్యం పెరుగుతోందని చెప్పారు.