సింగరేణిలో కిరాయి బండ్ల బినామీ దందా

సింగరేణిలో కిరాయి బండ్ల బినామీ దందా

సింగరేణిలో అద్దె వెహికల్స్​ బాగోతం 

నిర్వాసితుల పేర దళారుల టెండర్లు

మందమర్రి, వెలుగు: సింగరేణిలో అద్దె వాహనాల్లో బినామీల హవా కొనసాగుతోంది. భూనిర్వాసితులకు ఎంతోకొంత ముట్టజెప్పి వారి పేరిట దళారులు వెహికల్స్​ పెట్టి జేబులు నింపుకుంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్​ ప్రాజెక్టుల్లో ఈ దందాను సింగరేణి మేనేజిమెంట్​ కట్టడిచేయలేకపోతోంది. తాజాగా మందమర్రి ఏరియాలో 14 కొత్త వెహికల్స్​ కోసం సింగరేణి టెండర్లు పిలిచింది. మంగళవారం వరకు టెండర్లు దాఖలు చేయడానికి గడువుంది. దీంతో బినామీలు నిర్వాసితులతో బేరసారాలు మొదలుపెట్టారు.  రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు గుడ్​విల్​ఆశ చూపి వారి పేర టెండర్లు వేస్తున్నారు.

బినామీల చేతుల్లోనే వెహికల్స్​ …

సింగరేణిలో అవసరమైన వెహికల్స్​ను యాజమాన్యం అద్దెకు తీసుకుంటుంది. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారి నుంచి వెహికల్స్​ హైర్​ చేసుకోవడానికి సింగరేణి ప్రయారిటీ ఇస్తుంది. వారు టెండర్లు వేయకపోతే రిటైర్డు కార్మికుల కుటుంబాల్లోని అన్​ఎంప్లాయిడ్​ యూత్​కు ఇస్తుంది. రోజుకు 12  నుంచి 24 గంటల పాటు నడిపించేలా.. 3 నుంచి ఐదేండ్ల కాలానికి వెహికల్స్​ హైర్ చేసుకుంటుంది.  రోజుకు నడిచే టైమ్​ను బట్టి ఒక్కో వెహికల్​కు  నెలకు రూ.24 వేల నుంచి రూ.60వేల అద్దె చెల్లిస్తారు. 24 గంటలు హైర్​ చేసుకుంటే రూ.80వేల వరకు ఇస్తారు. సింగరేణి వ్యాప్తంగా వందల్లో హైర్​ బండ్లు  నడుస్తున్నాయి. ఇందులో సగానికి సగం బినామీలవేనన్న  ఆరోపణలున్నాయి.

గుడ్​విల్​ పేరుతో దందా…

భూనిర్వాసితులకు ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తుండడంతో బినామీలు వారి పేర్లను వాడుకుంటున్నారు. ఒక్కొక్కరు పది, పదిహేను బండ్లు పెట్టి లక్షల్లో దండుకుంటున్నారు. చాలాకాలంగా ఈ దందా చేస్తున్న వారు సింగరేణి ఆఫీసర్లతో జత కట్టి ఇతరులెవరూ ఇందులోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు.  గుడ్​విల్​ ఆశచూపో,  బెదిరించో కొత్తవాళ్లు టెండర్లు వేయకుండా చూసుకుంటున్నారు. మందమర్రి ఏరియాలో కళ్యాణిఖని ఓసీపీ వల్ల  ఎర్రగుంటపల్లి, ఊరుమందమర్రి, కాసిపేట మండలంలోని కొందరు భూములు కోల్పోయారు. కొంత మంది బినామీలు వీరిని కలిసి గుడ్​విల్​ ఆశ చూపి.. వారి పేర్ల మీద టెండర్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. శ్రీరాంపూర్​, బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన నిర్వాసితులతో కూడా టెండర్లు వేయించినట్టు చెప్తున్నారు. మందమర్రికి చెందిన పలువురు వెహికల్​ ఓనర్లు టెండర్లు వేయించడంలో  కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. గతంలో బినామీలు చేసుకున్న  అగ్రిమెంట్​ను కాదని నిర్వాసితులకు కేవలం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు మాత్రమే ఇచ్చారని, వారు వినకపోతే ఆఫీసర్లతో రకరకాలుగా బెదిరింపులకు దిగారన్న ప్రచారం ఉంది. వెహికల్స్​ దందాను సింగరేణి విజిలెన్స్​విభాగం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. బినామీలు నిర్వాసితుల పేర టెండర్లు దక్కించుకుకోవడంతో రిటైర్డు కార్మికుల  పిల్లలకు  అన్యాయం జరుగుతోంది.

విజిలెన్స్  చర్యలు తీసుకోవాలె

సింగరేణిలో భూనిర్వాసితుల పేర్లతో ఇతరులు వాహనాలను ఏర్పాటు చేస్తున్న వ్యవహారంపై విజిలెన్స్​ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని -ఏఐటీయూసీ లీడర్ ​భీమనాథుని సుదర్శనం డిమాండ్ చేశారు. నిర్వాసితులే వాహనాలను పెట్టుకునేలా ప్రోత్సాహించాలి. రిటైర్డు కార్మికుల పిల్లలకు సమాన అవకాశం కల్పించాలె.

For More News..

రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్​తో గందరగోళం.. పొద్దంతా సర్వర్‌‌ తిప్పలు

60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్​ ఇచ్చే ఆలోచనలో కేంద్రం

ఫేస్​బుక్​ లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు