
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగానికి కొత్త టెక్నాలజీని అందించడానికి హైదరాబాద్ యూనివర్సిటీ (యూఓహెచ్)తో బయోఫాక్టర్ ఎంఓయూ కుదుర్చుకుంది. నానోటెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చేయడానికి రెండు సంస్థలూ కలసి పనిచేస్తాయి. ఇవి కొత్త నానోసెల్స్ను అభివృద్ధి చేస్తాయి. వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానోసెల్స్ రూపకల్పనపై పరిశోధిస్తాయి.
నానోసెల్స్ భద్రత కోసం విషపరీక్షలు నిర్వహిస్తాయి. వ్యవసాయం, పౌల్ట్రీ, ఫిషరీస్లో నానో టెక్నాలజీ వినియోగంపై బయోఫాక్టర్లో శిక్షణ ఇచ్చి ఇంటర్న్షిప్ అవకాశాలు అందిస్తాయి. నానో టెక్నాలజీ ల్యాబ్లో బయోఫాక్టర్ శాస్త్రవేత్తలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి విశేష ప్రయోజనం ఉంటుందని రెండు సంస్థలు ప్రకటించాయి. పంటలకు తగిన పోషకాలు అందడం, చీడపీడల ముప్పు లేకపోవడంతో దిగుబడి ఎక్కువ వస్తుందని పేర్కొన్నాయి.