
- రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ బంద్
- మొబైల్ ఓటీపీ.. ఐరిస్ తో పంపిణీ
- ఫిబ్రవరి నెల నుంచి అమలులోకి
- ఆధార్ తో ఫోన్ నంబర్ లింక్ అప్ తప్పనిసరి
హైదరాబాద్, వెలుగు: రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ను నిలిపివేస్తున్నట్టు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి సెల్ఫోన్కు వచ్చే ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ ఇవ్వనుంది. బయోమెట్రిక్ ఆపేయాలనే హైకోర్టు ఆదేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్కారు నుంచి కొత్త సూచనలు వచ్చే వరకు ఈ విధానాన్నే అమలు చేయనుంది. బయోమెట్రిక్ పద్ధతిలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా రావొచ్చంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విధానాన్ని నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. లబ్ధిదారులు రేషన్ షాపులో కార్డు నంబరు చెప్పగానే ఈ-పోస్ డివైస్లో ఎంటర్ చేస్తారు. అతని పేరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయగా సెల్ఫోన్కు వన్టైమ్ పాస్ వర్డ్(ఓటీపీ) వస్తుంది. అది చెప్పితే ఈ–పోస్ డివైస్లో ఎంటర్ చేసి రేషన్ ఇస్తరు. లబ్ధిదారు కుటుంబంలో ఎవరికి సెల్ఫోన్ ఉన్నా ఓటీపీ ద్వారా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ సెల్ఫోన్ లేకపోతే ఐరిస్ ద్వారా కన్ను స్కాన్ చేసి రేషన్ ఇస్తరు.
ఆధార్ సెల్ఫోన్ లింక్ అప్ చేసుకోవాలి
రేషన్ లబ్ధిదారులు వారి ఆధార్ కార్డుకు సెల్ఫోన్ నంబరును లింక్ అప్ చేసుకోవాలని సివిల్ సప్లయ్స్ అధికారులు చెబుతున్నారు. రేషన్ లబ్ధిదారులకు ఆధార్ సీడింగ్ అయిందని చెబుతున్నరు. ఈ నెలాఖరు వరకు మీ–సేవా సెంటర్లలో ఆధార్ లింక్ అప్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
గ్రేటర్లో ఐరిస్ లేదు
గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రేషన్ షాపుల్లో ఐరిస్ అమలులో లేదు. దీంతో ఇక్కడ మొబైల్ ఓటీపీ తప్పనిసరి. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల కుటుంబాలకు, ఒంటరి మహిళల్లో కొందరికి సెల్ఫోన్ లేదు. అసోంటి కుటుంబాలు రేషన్ ఎలా తీసుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఓటీపీ, ఐరిష్ ద్వారా రేషన్
వికారాబాద్, వెలుగు: రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మెషీన్ వినియోగిస్తే కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి నుంచి ఓటీపీ లేదా ఐరిస్ పద్ధతిలో సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ తెలిపారు.
For More News..