
బర్డ్ ఫ్లూ మళ్ళీ విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు మృతి చెందుతున్నాయని ప్రచారం జరుగోతుంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన పశు సంవర్థక శాఖ సంబంధిత అధికారులు.. మృతి చెందిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్ లో టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. కోళ్ల శాంపిల్స్ ను పరిశీలించిన అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్థారించినట్లు తెలుస్తోంది.
కోళ్ల మృతి ప్రభావం.. చికెన్ సెంటర్లు, పౌల్ట్రీ రంగంపై పడింది. బర్డ్ ఫ్లూ అని ప్రచారం జరగడంతో జనాలు కొద్దిరోజులు చికెన్ తినకుండా ఉండడమే మంచిదని భావిస్తున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఈ ఘటన కంటే ముందు కేజీ చికెన్ ధర దాదాపు రూ.260 చేరుకుంది. అయితే, ఇతర ప్రాంతాల్లో మాత్రం కోళ్లు మృతి చెందిన ఘటనలు నమోదు కాలేదు.అయినా ప్రచారం ఆగకపోవడంతో.. పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీయాలని కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు.