
తెలంగాణ ముద్దు బిడ్డ, ఇండియా బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టింది. వరల్డ్ చాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గాలివాటం కాదని నిరూపించింది. ఖతర్నాక్ పంచ్లతో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ.. కామన్వెల్త్ గేమ్స్లో పోటీ పడ్డ మొదటి సారే గోల్డ్ మెడల్ సాధించి శభాష్ అనిపించింది. ఆమెతో పాటు బాక్సర్లు అమిత్ పంగల్, నీతు కూడా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ట్రిపుల్ జంప్లో ఎల్డోస్ పాల్ బంగారం తెచ్చాడు. తెలుగు షట్లర్ శ్రీకాంత్ బ్రాంజ్ నెగ్గాడు. ఇతర క్రీడల్లోనూ ఈవెంట్లలో మంచి ఫలితాలు రావడంతో ఇండియా పతకాల సంఖ్య 50 మార్కు దాటింది. పోటీలకు సోమవారమే చివరి రోజు.
బర్మింగ్హామ్: సూపర్ ఫామ్లో ఉన్న నిఖత్ జరీన్ ఊహించినట్టే కామన్వెల్త్ గేమ్స్లో తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం గెలిచింది. అమిత్ పంగల్, నీతు ఘాంఘస్ కూడా గోల్డ్ తేవడంతో బాక్సింగ్లో ఇండియా గోల్డెన్ హ్యాట్రిక్ సాధించింది. ఆదివారం జరిగిన విమెన్స్ 50 కేజీ టైటిల్ ఫైట్లో 26 ఏండ్ల నిఖత్ 5–0తో నార్నర్త్ ఐర్లాండ్కు చెందిన కార్లీ మెక్ నాల్ను చిత్తుగా ఓడించింది. ఆడిన అన్ని బౌట్స్లో ఏకపక్ష విజయాలు సాధించిన జరీన్ తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ ఆడుతూ పాడుతూ బంగారం తెచ్చింది. రింగ్లో చురుగ్గా కదిలిన హైదరాబాదీ పర్ఫెక్ట్ హూక్స్, జాబ్స్తో మూడు రౌండ్లలోనూ కార్లీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫుల్ కాన్ఫిడెన్స్తో కనిపించిన నిఖత్ డిఫెన్స్ కూడా అంతే బలంగా ఉండటంతో మరో ఆలోచనే లేకుండా ఐదుగురు జడ్జీలు ఆమెను విజేతగా ప్రకటించారు. ఇక, తొలిసారి కామన్వెల్త్ ఆడుతున్న 21 ఏండ్ల నీతు కూడా 48 కేజీ ఫైనల్లో 5–0తో జేడ్ రెజ్టన్ (ఇంగ్లండ్)ను చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్తో పాటు వరల్డ్ చాంపియన్షిప్లో నిరాశ పరిచిన స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణంతో తిరిగి ఫామ్లోకి రాగా.. మెన్స్ 51 కేజీ ఫైనల్లో అమిత్ 5–0తో కైరన్ మెక్డొనాల్డ్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో అతని చేతిలో ఎదురైన ఓటమికి రివెంజ్ తీర్చుకున్నాడు.
ఈ మెడల్ నాకెంతో ముఖ్యం
కొత్త వెయిట్ కేటగిరీలో వచ్చిన ఈ మెడల్ నాకెంతో ముఖ్యం. దీని కోసం నేను చాలా కష్టపడ్డా. రెండు కిలోల బరువు తగ్గి, నా పవర్, స్పీడ్ పడిపోకుండా చూసుకున్నా. ఇకపై ఇదే వెయిట్ కేటగిరీలో కొనసాగుతా. వరల్డ్ చాంపియన్షిప్స్తో పోలిస్తే కామన్వెల్త్లో పోటీ తక్కువే అయినా.. నాకిది కొత్త అనుభవం. వరల్డ్ మెడల్ తర్వాత నాపై అంచనాలు పెరిగాయని తెలుసు.ఆ ఒత్తిడి నా ఉత్తమ ఆటను బయటకు తీస్తుంది. ఈ మెడల్ మా అమ్మకు బర్త్డే గిఫ్ట్. ఇంటికి వెళ్లగానే దీన్ని ఆమె మెడలో వేస్తా. జనవరి నుంచి వరుసగా టోర్నీలు ఆడుతున్నా. కనీసం నా విజయాలను ఆస్వాదించే టైమ్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటా. - నిఖత్ జరీన్
ఈ సారి అమ్మ కోసం..
‘ఇప్పుడు నా టార్గెట్ కామన్వెల్త్లో గోల్డ్ నెగ్గడమే’. వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత నిఖత్ చెప్పిన మాట ఇది. చెప్పినట్టే నిఖత్ గోల్డ్ నెగ్గి చూపెట్టింది. సూపర్ ఫామ్లో ఉన్న జరీన్ తొలి రౌండ్ నుంచే తన మార్కు చూపెట్టింది. ఫైనల్లో ఆమె ఆట చూసిన వాళ్లకు గోల్డ్ ఇంత ఈజీగా నెగ్గొచ్చా? అనిపించింది. కానీ, ఇందుకోసం జరీన్ చాలా కష్టపడ్డది. వరల్డ్ చాంపియన్షిప్ తర్వాత నిఖత్ 52 కేజీల నుంచి 50 కేజీల కేటగిరీకి మారింది.
తనకిష్టమైన ఐస్క్రీం, ఇతర ఫుడ్ తినకుండా.. వర్కౌట్స్ చేసింది. ఈ విభాగంలో తనకు ఇదే తొలి పోటీ. సాధారణంగా వెయిట్ మారిన తర్వాత కుదురుకునేందుకు ఎవరికైనా సమయం పడుతుంది. కానీ, తెలంగాణ బాక్సర్ ఈ పతకం కోసం పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. వరల్డ్ చాంపియన్షిప్ ముగిసిన వెంటనే నేషనల్ క్యాంప్లో జాయిన ఆమె పూర్తిగా గేమ్పైనే ఫోకస్ పెట్టింది. తన డిఫెన్స్ను మరింత మెరుగు పరుచుకుంది. కామన్వెల్త్లో గోల్డ్ నెగ్గేందుకు మరో అంశం నిఖత్ను కూడా ఉత్సాహ పరిచింది.
గత బుధవారం ఆమె తల్లి పర్వీన్ సుల్తానా బర్త్డే. దాంతో, గోల్డ్తో ఆమెకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది. తన చేతి గోర్లపై త్రివర్ణ పతాకంతో పాటు కామన్వెల్త్ గోల్డ్ మెడల్ను పెయింటింగ్గా వేయించుకుంది. ‘అమ్మ పుట్టినరోజున నేను ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలనుకుంటున్నానో ఇవి నాకు గుర్తు చేశాయి’ అని నిఖత్ చెప్పింది. అనుకున్నట్టే అమ్మకు బంగారు పతకాన్ని బహుమతిగా ఇచ్చింది. ఇక, నిఖత్ తర్వాతి టార్గెట్ 2023 ఆసియా గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్. ఈ రెండింటిలోనూ పతకాలు సాధిస్తే ఇండియా స్పోర్ట్స్ హిస్టరీలో నిఖత్ పేరు నిలిచిపోవడం ఖాయం.
నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ ఫోన్
బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరీన్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, ఆమె విజయపరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే వుంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ తో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ‘బంగారు పథకాన్ని సాధించి భారత దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేశావు..’ అని నిఖత్ జరీన్ ను కేసీఆర్ అభినందించారు.