
- అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిషో వంటి కంపెనీల వేర్హౌస్లపై దాడి
న్యూఢిల్లీ: బీఐఎస్ సర్టిఫికేషన్ లేని ప్రొడక్ట్లను అమ్ముతున్న ఈ–కామర్స్ కంపెనీలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొరడా ఝులిపించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిషో, మింత్రా, బిగ్బాస్కెట్ వంటి వివిధ ఈ–కామర్స్ కంపెనీలకు చెందిన వేర్హౌస్లపై దాడులు నిర్వహించింది. వీటికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7న దాడులు జరిగాయని, లక్నోలోని అమెజాన్ వేర్హౌస్లో బీఐఎస్ సర్టిఫికేషన్ లేని 215 బొమ్మలు, 24 హ్యాండ్ బ్లెండర్లను సీజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు.
కిందటి నెలలో ఈ కంపెనీకే చెందిన గురుగ్రామ్ వేర్హౌస్లో దాడులు నిర్వహించి 58 అల్యూమినియం షీట్లు, 34 మెటల్ వాటర్ బాటిల్స్, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7పీవీసీ కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, ఒక స్పీకర్ను సీజ్ చేశారు. గురుగ్రామ్లోని ఫ్లిప్కార్ట్ వేర్హౌస్లో 534 స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ బాటిల్స్, 134 బొమ్మలు, 41 స్పీకర్లను బీఐఎస్ అధికారులు సీజ్ చేశారు. ఈ కంపెనీకి చెందిన రెండు ఢిల్లీ వేర్హౌస్లలో దాడులు జరిపి, బీఐఎస్ సర్టిఫికేషన్ లేని 7 వేల ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4 వేల ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్స్ను సీజ్ చేశారు. డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్ఫ్లై వంటి బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్లను సీజ్ చేశారు. బీఐఎస్ సర్టిఫికేషన్ లేని ప్రొడక్ట్లను అమ్మితే రూ.2 లక్షల వరకు లేదా ప్రొడక్ట్ ధరపై 10 రెట్లు పెనాల్టీ పడుతుంది.