దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

 దళారులను నమ్మి  రైతులు మోసపోవద్దు
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

లక్ష్మణచాంద, వెలుగు: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించి లబ్ధి పొందాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండలంలోని పీచరలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు లాభాలు చేకూరేలా ప్రధాన పంటలకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే మద్దతు ధర పెంచిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నో హామీలిచ్చి ఎన్నికల తర్వాత అమలు చేయడం లేదన్నారు. 

ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పిన కొందరికి మాత్రమే చేసిందన్నారు. రైతు భరోసా ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటినైనా రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎర్ర రఘునందన్ రెడ్డి,నాయకులు ఎర్ర ముత్యం రెడ్డి,అడ్వాల రమేశ్, సురకంటి ముత్యం రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్ అధికారులు పాల్గొన్నారు.