
రాయికోడ్, వెలుగు : పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని పటేల్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జహీరాబాద్ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు బడా బాబులకు దోచి పెట్టాయే తప్పా అభివృద్ధి చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారని, పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందన్నారు.
ఉమ్మడి ఏపీలో రాయికోడ్కు నేషనల్ స్పోర్ట్స్ కాలేజీని మంజూరు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని సిద్దిపేటకు తరలించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కానీ, ఏ ఒక్కరూ అడ్డుకోకపోవడంతో తాను మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. సిరూర్, పీపడ్ పల్లి, రామోజిపల్లి, నల్లంపల్లి, తదితర గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ సుభాష్రెడ్డి, ఎంపీపీ మొగులప్ప, జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ నాగిశెట్టి, డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్దన్న పాటిల్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కేదార్నాథ్ పాటిల్, ఏసప్ప, నాయకులు సుభాష్ పాటిల్, ప్రభాకర్, బస్వరాజ్ పాటిల్ పాల్గొన్నారు.