
కరీంనగర్ -మెదక్- ఆదిలాబాద్ -నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే విజయం సాధించారు కొమురయ్య . బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959, వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్ కు 2621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు పోలయ్యాయి. మల్క కొమురయ్య విజయంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
మరో వైపు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈయన గెలుపొందారు. ఇక మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ తరఫున నరేందర్రెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలో మొత్తం 2లక్షల 50 వేలకు పైగా ఓట్లు పోలైతే 40 వేలకు పైగా ఓట్లు చెల్లనివి ఉండటంతో ఉత్కంఠగా మారింది.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే..ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది.