- బడ్జెట్ కేటాయింపులో కేంద్రప్రభుత్వం పక్షపాత దృష్టి
2025 - 26 కేంద్ర బడ్జెట్పై ప్రశంసలతోపాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అందులో ప్రధానంగా పేర్కొనదగినది ‘బడ్జెట్లో రాష్ట్రాలకు కేటాయించిన వాటాలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృష్టితో వ్యవహరించింది’ అని.. ఈ విమర్శ కొత్తది కాదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెసేతర ప్రభుత్వాలకు అన్యాయం చేసింది. అదే విధానాన్ని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోంది. బడ్జెట్లో రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయంలో వివక్ష చూపుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతుతో అధికారంలో కొనసాగుతోంది. ఈ కారణంగానే ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులను కేటాయించింది.
ఇందుకు మరో కారణం ఈ సంవత్సరం బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనుండడం. ఇందులో తప్పుపట్టవలసిన విషయం ఏమీ లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపు విషయంలో అన్యాయమే చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వలన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించలేదని స్పష్టంగా తెలుస్తోంది.
తెలంగాణ విన్నపాలను పట్టించుకోలేదు
రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరచడం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు సుమారు 12 సార్లు ఢిల్లీ పర్యటన జరిపి తాము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరారు. కానీ, ఫలితం దక్కలేదు.
ట్రైబల్ వర్సిటీకి నిధులు ఎన్ని?
రాష్ట్ర విభజన సమయంలో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. 10 సంవత్సరాల తర్వాత ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2024-–25 ఈ విశ్వ విద్యాలయంలో రెండు బీఏ కోర్సులు ప్రారంభించింది. తాత్కాలిక భవనంలో తరగతులను నిర్వహిస్తున్నారు.
ఈ విశ్వవిద్యాలయానికి అరకొరగానే నిధులు కేటాయింపు జరిగాయి. గత సంవత్సరం బడ్జెట్లో మాదిరిగానే ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా గిరిజన విశ్వవిద్యాలయానికి ఎన్ని నిధులు కేటాయిస్తారనే అంశంపైనా స్పష్టత లేదు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కేటాయించిన బడ్జెట్ నుంచి గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయింపులు ఉంటాయని ప్రకటించారు.
‘ఉపాధి హామీ’కి నిధులు పెంచలేదు
తెలంగాణ రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతగానో ఆర్థికంగా తోడ్పడింది. ఈ సంవత్సరం బడ్జెట్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచలేదు. గత సంవత్సరం కేటాయించిన రూ. 86 వేల కోట్లనే ఈసారి ప్రతిపాదించింది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వార్షిక పని దినాలను 10 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడనుంది.
మెట్రో రెండో దశ ప్రస్తావన లేదు
దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులకు అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.31 కోట్లు ప్రతిపాదించారు. గమనార్హమైన అంశమేమిటంటే హైదరాబాద్ నగరంలో ప్రారంభించాలని తలపెట్టిన మెట్రో రెండోదశ ప్రాజెక్టు నిధులను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. కానీ, కేంద్ర బడ్జెట్లో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు. ఫలితంగా రూ. 24 వేల కోట్ల అంచనా వ్యయంతో ఐదు మార్గాల్లో అభివృద్ధి చేయదలచిన మెట్రో రైలు ప్రాజెక్ట్ అంశం గందరగోళంలో పడింది.
కిసాన్ క్రెడిట్ కార్డులకు రుణం పెంపు
రైతులకు అందుబాటులో ఉన్న కిసాన్ క్రెడిట్ రుణాన్ని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వలన తెలంగాణ రాష్ట్ర రైతులకు కూడా లాభం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రంలో 25,01,925 మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. ఈ కారణంగా వారికి రూ. 29,792 కోట్ల రుణాలు లభిస్తాయి.
మరో మంచి అంశం ఏమిటంటే వరంగల్లోని మామునూరుబ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చినట్లు అనిపిస్తోంది. ఆదేవిధంగా కొత్తగూడెం లోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వచ్చి ఫీజుబిలిటీ పరీక్షలను నిర్వహించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు పడే అవకాశం ఉంది. మొత్తంమీద కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని చెప్పాలి. పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తే బాగుండేది.
తెలంగాణ వాటా పెంచాలి
కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి వాటాగా వచ్చే ఆదాయ శాతం పెరగలేదు. పంపకాల తీరును గమనిస్తే తెలంగాణ రాష్ట్రం2.1 శాతంగా 15వ స్థానంలో ఉంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 17.33 శాతంగా, బిహార్ రాష్ట్రానికి 10 శాతంగా నిధులు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కోరినా ఫలితం దక్కలేదు. ఈ నిధులు పెరగని కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు పెరిగాయి.
- డా. పి. మోహన్ రావు, ప్రొఫెసర్ (రిటైర్డ్)-