
- రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై సంస్థాగతంగా చర్చ జరుగుతున్నదని.. కొత్త బాస్ విషయంలో కొత్త, పాత అనేది ఏమి ఉండదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అనుభవం, సామాజిక సమీకరణలు సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని అధ్యక్ష ప్రకటన ఉంటుందని తెలిపారు. ఏప్రిల్లోగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని స్పష్టం చేశారు.
శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులో తప్పులు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల, మత, ప్రాంతీయ, విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలను కాంగ్రెస్ చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.