
పటాన్ చెరు, వెలుగు: దేవుడి భూముల జోలికొస్తే ఊరుకోమని, కబ్జాదారుల తాటతీస్తామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని కోదండ రామాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదండ రామాలయానికి చెందిన 7.19 ఎకరాల దేవుడి మాన్యం భూమిని ఆక్రమించి ఏపీఆర్ గ్రూప్కు, ఆర్ఎంసీ ప్లాంట్ కోసం లీజుకివ్వడం దుర్మార్గమన్నారు.
వందల కోట్ల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నించడమే కాకుండా లీజు సొమ్మును సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీసుకుంటూ అక్రమ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల అవకతవకలను ప్రశ్నించిన కోదండ రామాలయం ట్రస్ట్ చైర్మన్ మనోహర్ రెడ్డిని బెదిరించి దందా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
వెంటనే రామాలయం భూముల్లో నడిపిస్తున్న ఆర్ఎంసీ ప్లాంట్ ఖాళీ చేయాలని లేని పక్షంలో పటాన్ చెరు నడిబొడ్డున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.