
- తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోంది
మెదక్, వెలుగు: తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోందని, 12 కు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని సిర్పూర్ కాగజ్ నగర్ఎమ్మెల్యే, మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పాల్వాయి హరీశ్ అన్నారు. గురువారం రాత్రి మెదక్ పట్టణంలో జరిగిన మెదక్లోక్ సభ నియోజకవర్గ పరిధి బీజేపీ బూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీని ప్రజలెవరూ నమ్మడం లేదని, లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే మిగులుతాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అత్యంత అవినీతి పరుడైన ఆఫీసర్గా పేరొందారని ఆరోపించారు. ఓఆర్ఆర్ నుంచి మొదలుకుని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వరకు ఆయన వాటాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. అలాంటి అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే గుడినే కాదు గుడిలోని లింగాన్ని సైతం మింగేస్తారని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ల వైఖరిలో మార్పు ఉంటుందన్నారు.
ఎవరిని కదిలించినా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తామంటున్నారని, రాష్ట్రంలో 12 సీట్లు బీజేపీకి వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పని అసెంబ్లీ ఎన్నికల్లోనే అయిపోయిందని, ఇచ్చిన హామీలు విస్మరించిన కాంగ్రెస్ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. మెదక్లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుమాట్లాడుతూ బీఆర్ఎస్ జనంతోని గెలవలేమని చెప్పి ధనంతో గెలవాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లాలో జై తెలంగాణ అన్న వారెవరూ దొరక్క గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర సూట్ కేసులు మోసి, మాజీ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇచ్చారని విమర్శించారు.
మూడేళ్లు ఎమ్మెల్సీగా ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి, ఇపుడు తనను ఎంపీగా గెలిపిస్తే వంద కోట్లతో స్కూల్లు పెట్టిస్తా, దవాఖానాలు కట్టిస్తా అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మోసకారి పార్టీ అని విమర్శించిన నీలం మధు ఇపుడు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఇరవై ఐదేళ్లుగా మెదక్ గడ్డమీద కాంగ్రెస్ ఎంపీ గెలవలేదని ఇపుడు కూడా గెలవబోదన్నారు. బూత్ కమిటీ బాధ్యులు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓటడగాలని సూచించారు. సమావేశంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, గోదావరి, మోహన్రెడ్డి, నాయకులు పంజా విజయ్కుమార్, మురళీ యాదవ్, పులి మామిడి రాజు, దూది శ్రీకాంత్రెడ్డి, కరణం పరిణిత, రాజశేఖర్, ఎం ఎల్ఎన్ రెడ్డి, గడ్డం కాశీనాథ్, మధు, నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.