![నిర్వాసితుల గోడు ఎవరికీ పట్టడం లేదు](https://static.v6velugu.com/uploads/2022/02/BJP Leader Vijayashanthi says; No one take care about expatriates of mallannasagar_i7xpQMgPT3.jpg)
ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు కానీ.. నిర్వాసితులను మాత్రం పట్టించుకోవట్లే
కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెడీ అయినా.. నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదని బీజేపీ లీడర్ విజయశాంతి అన్నారు. రిజర్వాయర్ను ఈ నెల 23న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ.. నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఆఫీసర్ల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయి. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ ఆఫీసర్లు తరలించారు. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్ గ్రామ నిర్వాసితులను తరలించగా... 8 నెలల క్రితం చివరిగా బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులను తరలించారు. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగా.. మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు ఏడాది కావస్తున్నా... 3500 కుటుంబాలకు అటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గానీ, ఇటు ఓపెన్ ప్లాట్లను గానీ ఇవ్వలేదు. నిర్వాసితులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ ఆవేదనతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు ఆడ పిల్లలున్న రాజబాబు అనే నిర్వాసితుడు ఏడాది క్రితం ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మరణించారు. ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు అనే నిర్వాసితుడు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన ఎనబై ఏళ్ల వృద్ధురాలు బాలవ్వ ఆత్మహత్య చేసుకుంది. భవిష్యత్తు ఆశలపై నీళ్లు జల్లిన ఈ పాలక రాబందుల కారణంగా ఊరికాని ఊరిలో తనువు చాలించిన అభాగ్యుల ఉసురు ఊరికనే పోదు. ప్లాట్ల దందాల కోసం నిర్వాసితులకు వారి గ్రామాలతో శాశ్వతంగా బంధాల్ని తెంచేస్తున్న దౌర్భాగ్యులకు పుట్టగతులు ఉండవు. అమ్మలారా, అక్కలారా... మీరెవరూ ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు అండాగా బీజేపీ ఉంటుంది. మనకు దక్కాల్సిన హక్కులను కొట్లాడి సాధించుకుందాం. కేసీఆర్ను గద్దె దించుదాం’ అని విజయశాంతి అన్నారు.
మరిన్ని వార్తల కోసం..