
భూపాలపల్లి అర్బన్/హనుమకొండ/ములుగు/మహబూబాబాద్ అర్బన్/వరంగల్ సిటీ/జనగామ అర్బన్, వెలుగు : డబుల్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దగా చేస్తున్నారని, పేదల కోసం కట్టించిన ఇండ్లను అమ్ముకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మడి జిల్లాలో బీజేపీ లీడర్లు ఆందోళన నిర్వహించారు. భూపాలపల్లి కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, హనుమకొండలో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి, వరంగల్లో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, ములుగులో మాజీ మంత్రి గుండె విజయరామారావు, జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్రెడ్డి, మహబూబాబాద్లో బీజేపీ స్టేట్ లీడర్ రేవూరి ప్రకాశ్రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్నాయక్, జనగామలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మాట్లాడారు.
ఇప్పటికే పూర్తైన ఇండ్లను సైతం లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం సరికాదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోగా, పేదలకు ఇండ్ల స్థలాలు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కమీషన్ల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదన్నారు. వరంగల్ నగరంలో డబుల్ ఇండ్ల ఓపెనింగ్ రోజున దావత్ చేసుకుందామన్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు జాడ లేకుండా పోయారన్నారు. పేదల సొంతింటి కలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికలు వస్తుండడంతో గృహలక్ష్మి పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేదల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు.