
మెట్ పల్లి, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసి రైతులు, కార్మిక కుటుంబాలకు ఉపాధి లేకుండా చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలో నేషనల్ హైవే పై బైఠాయించిన చెరుకు రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ.. 1947 లోనే బోధన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రారంభమైందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఫ్యాక్టరీలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2015 లో లే ఆఫ్ ప్రకటించి మూసివేశారన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 10 వేల మంది కార్మిక, కర్షక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
షుగర్ ఫ్యాక్టరీలు వెంటనే తెరిపించాలని, కర్మాకారానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, ఏలేటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.