
- అందుకే ఇంటర్ బోర్డు పట్టించుకోవట్లేదు
- రెండు నెలలకే ఏడాది ఫీజు చెల్లించాలనడం దారుణం: సంజయ్
హైదరాబాద్, వెలుగు: పరీక్ష ఫీజులు తీసుకోవాలంటే టర్మ్ ఫీజు మొత్తం కట్టాలని కార్పొరేట్ కాలేజీలు కండిషన్స్ పెట్టడంపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. 2 నెలల క్లాసులకే మొత్తం ఫీజు చెల్లించాలని స్టూడెంట్స్ను వేధించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీలు ఫీజు కోసం వేధిస్తున్నా ఇంటర్ బోర్డుకు పట్టదా అని ప్రశ్నించారు. అధికారులు కళ్లుమూసుకున్నారా అని మండిపడ్డారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజుతో టర్మ్ ఫీజుకు లింకు పెట్టి స్టూడెంట్లను వేధించొద్దంటూ ఇంటర్ బోర్డు, సెకండరీ బోర్డు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్టూడెంట్లు, లెక్చరర్లను వేధించకుండా కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు కనువిప్పు కలిగించాలని వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు. కార్పొరేట్ కాలేజీల వెనక టీఆర్ఎస్ పెద్దలు ఉండడం వల్లే ఇంటర్ బోర్డు మౌనంగా ఉంటోందని సంజయ్ ఆరోపించారు. ఆ మౌనం వెనక ఎవరి ప్రయోజనం దాగుందో తమకు తెలుసన్నారు. సమయం వచ్చినప్పుడు కాలేజీల చరిత్ర, టీఆర్ఎస్ నేతల బండారం బయట పెడతామని హెచ్చరించారు. మునుపటిలాగా ఇంటర్ స్టూడెంట్లకు ఏదైనా నష్టం జరిగితే.. ప్రభుత్వ పెద్దల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. లెక్చరర్లు, టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మేధావులు, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ల కుటుంబ సభ్యుల ఉసురు పోసుకోవద్దని కాలేజీ మేనేజ్ మెంట్లకు సూచించారు. సిబ్బందితో వెంటనే మీటింగ్ పెట్టి జీతాల సమస్యను పరిష్కరించాలని సూచించారు.
For More News..