
- రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదు: లక్ష్మణ్
- రూ.5,337 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. దేశంలో రైల్వే పనితీరుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొని, మాట్లాడారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,337 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి కేవలం రూ.886 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.40 వేల కోట్ల పనులు ఆన్ గోయింగ్లో ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి తెలంగాణలో 753 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి 17 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగితే, ప్రస్తుతం 68 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు.
అన్ని రైల్వే లైన్లలో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేశామని చెప్పారు. అమృత్ స్టేషన్స్ స్కీం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించామని తెలిపారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ.715 కోట్లు, హైదరాబాద్ స్టేషన్కు రూ.327 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఏపీతో కలుపుకొని తెలుగు రాష్ట్రాలకు 13 వందే భారత్ రైళ్లను కేంద్రం కేటాయించిందన్నారు. ఇందిరా గాంధీని గెలిపించి పార్లమెంట్కు పంపిన మెదక్ నియోజకవర్గానికి కూడా మోదీ సర్కార్ మూడు రైల్వే స్టేషన్లు కేటాయించిందని తెలిపారు.