
- గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ ఎదుట బీజేపీ ఆందోళన
- గేట్కు టూలెట్ బోర్డు తగిలించి నిరసన
గజ్వేల్, వెలుగు : ‘కేసీఆర్.. ప్రజల్లోకి రా.. లేదంటే రాజీనామా చెయ్, అటు అసెంబ్లీకి పోవడం లేదు.. ఇటు గజ్వేల్కు రావడం లేదు.. మీ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం’ అంటూ బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన కేసీఆర్ ఇప్పటివరకు నియోజకవర్గానికి, క్యాంప్ ఆఫీస్కు రాకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ లీడర్లు ఆందోళనకు దిగారు. క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేట్కు తాళం వేసి, టూలెట్ బోర్డు తగిలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు జశ్వంత్రెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలన్న నినాదంతో ఏర్పడ్డ తెలంగాణను పాలించిన కేసీఆర్ నీళ్లు, నిధులను తన ఫామ్హౌజ్కు, నియామకాలను తన కుటుంబ సభ్యులకు మళ్లించి, నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.
గజ్వేల్ నియోజకవర్గం అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎంగా ఉన్న టైంలో నియోజకవర్గానికి రాకపోవడానికి టైం లేకపోతే... ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పని చేయకుండా కూసున్న కాడే తినుకుంటు నెలకు రూ. 4 లక్షల జీతం తీసుకుంటున్న ఏకైక వ్యక్తి కేసీఆరే అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పల మధుసూదన్, వెంకట్రెడ్డి, దేవేందర్, కోదండం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ 15 నెలల నుంచి కనిపించడం లేదని, ఆయన ఆచూకీ కనిపెట్టాలని యూత్ కాంగ్రెస్ నేత అజర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గజ్వేల్ ప్రజలను కలవకుండా, అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకావడం లేదన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు స్పందించి కేసీఆర్ను వెతికిపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.